దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేపడుతుంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేపట్టట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేశ్ ప్రధాని మోడీని ప్రశ్నించారు. రాజస్తాన్లోని అశోక్ గహ్లోత్ సర్కార్ కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించిన మరుసటి రోజు రమేశ్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, హక్కుల కోసం చేపట్టే కులగణన అంశంపై ప్రధాని మోదీ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని ప్రశ్నించారు. రాజస్తాన్లో భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అనేక కుల సంఘాల సభ్యుల కలిసి ఇదే విషయాన్ని విన్నవించారని తెలిపారు. వారి వినతిని రాహుల్ సీరియస్ గా తీసుకున్నారని.. అందుకే రాజస్థాన్ లో కులగణన చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీజేపీని డిమాండ్ చేస్తోంది. ఇదే అంశాన్ని రానున్న ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మార్చి బీజేపీని ఇరుకున పెట్టాలని చూస్తోంది. దేశంలో బిహార్ తర్వాత కులాల సర్వే నిర్వహించనున్న రెండో రాష్ట్రంగా రాజస్థాన్ నిలవనుంది. అక్కడ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది.
బీజేపీ పాలిత రాష్ట్రాలలో కులగణన ఎందుకు చేయట్లేదు?
October 08, 2023
0
Tags