చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. కొత్త పార్లమెంటులోని లోక్సభలో మొదటిగా ఆమోదం పొందిన బిల్లు ఇదే కావడం విశేషం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈనెల 19న ప్రవేశపెట్టిన బిల్లుపై బుధవారంనాడు చర్చ చేపట్టారు. సుమారు 8 గంటల సేపు చర్చ అనంతరం దీనిపై ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది ఎంపీలు ఓటు వేయగా, ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యాంగ బిల్లు కావడంతో మాన్యువల్ పద్దతిలో లోక్సభ సెక్రటరీ జనరల్ ఈ ఓటింగ్ను నిర్వహించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగు స్పిప్పులను సభ్యులందరికీ అందజేశారు. ఓటింగ్ విధానాన్ని కూడా ఆయన వివరించారు. బిల్లుకు ఆమోదం తెలిపిన పక్షంలో ఆకుపచ్చ రంగు కాగితంపై 'ఎస్' అని రాయాలి. వ్యతిరేకించే వారు ఎరుపు రంగు స్లిప్పై 'నో' అని రాయాల్సి ఉంటుంది. ఓటింగ్ అనంతరం బిల్లు లోక్సభ ఆమోదం పొందినట్టు సభాపతి ఓం బిర్లా ప్రకటించారు. కాగా, లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లును ఈనెల 21న రాజ్యసభలో ప్రవేశపెడతారు. వెంటనే బిల్లుపై చర్చ జరిపి అదేరోజు ఓటింగ్ నిర్వహిస్తారు. ఉభయసభల ఆమోదం పొందిన వెంటనే బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం
September 20, 2023
0
Tags