జీ20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడానికి భారత్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా మంగళవారం ప్రకటించింది. ఈ ఉన్నతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయడానికి అన్ని పక్షాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.ఈ సదస్సుకు తమ అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరుకావడం లేదని అధికారికంగా ధ్రువీకరించిన మరుసటి రోజే చైనా నుంచి ప్రకటన వెలువడడం గమనార్హం. జీ20 కూటమికి చైనా తొలి నుంచీ అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోందని పేర్కొన్నారు. అదే తరహాలో ఈసారి భారత్లో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సుకూ తమ పూర్తి మద్దతు ఉందని తెలిపారు. దీన్ని విజయవంతం చేయడానికి అన్ని పక్షాలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 ఒక ఉన్నత స్థాయి వేదిక అని చెప్పారు. మొత్తంగా భారత్- చైనా మధ్య స్థిరమైన సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వివిధ స్థాయుల్లో ఇరు పక్షాలు చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. భారత్తో ద్వైపాక్షిక బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే, ఉభయ దేశాల మధ్య కీలకంగా మారిన సరిహద్దు వివాదాలను మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అధ్యక్ష హోదాలో భారత్ నిర్వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరుకావడం లేదు. దీని వెనుక కారణాలను చైనా వెల్లడించలేదు. 2013లో దేశ పగ్గాలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి జీ20 సదస్సుకు హాజరవుతూ వస్తున్న జిన్పింగ్ ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే ఢిల్లీ భేటీకి డుమ్మా కొట్టడం గమనార్హం. ఆయన స్థానంలో చైనా ప్రధాని లీ చియాంగ్ హాజరుకానున్నారు. 2020లో గల్వాన్ లోయ ఘర్షణలతో భారత్ చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
జీ20 సక్సెస్కు భారత్కు పూర్తి మద్దతు : చైనా
September 05, 2023
0
Tags