ప్రత్యేక విమానంలో స్వదేశానికి కోహ్లి !

Telugu Lo Computer
0


టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి భారత్‌కు చేరుకున్నాడు. వెస్టిండీస్‌ పర్యటన ముగించుకుని ప్రైవేట్‌ జెట్‌లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు కోహ్లి. తనను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చినందుకు ఎయిర్‌క్రాఫ్ట్‌ కెప్టెన్‌కు ధన్యవాదాలు తెలిపాడు. కాగా టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడిన జట్టులో భాగమైన రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి.. కరేబియన్‌ దీవికి వెళ్లిన విషయం తెలిసిందే. విండీస్‌తో టెస్టుల్లో అదరగొట్టిన ఈ స్టార్‌ బ్యాటర్‌.. వరుసగా 76, 121 పరుగులు సాధించాడు. రెండో టెస్టు సందర్భంగా.. కెరీర్‌లో 76వ, దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత విదేశీ గడ్డపై శతకం నమోదు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇదిలా ఉంటే.. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో ప్రయోగాల కారణంగా కోహ్లికి బ్యాటింగ్‌ చేసే అవకాశం, అవసరం రాలేదు. ఇక మిగిలిన రెండు వన్డేల్లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు కోహ్లికి కూడా విశ్రాంతినివ్వడంతో అతడి బ్యాటింగ్‌ మెరుపులు చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక టూర్‌ ముగియడంతో ప్రత్యేక విమానంలో కోహ్లి ఇండియాకు చేరుకున్నాడు. కాగా ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా వన్డే కప్‌-2023 దాకా కోహ్లి మళ్లీ మైదానంలో దిగే అవకాశం లేదు. ఈ లోపు జస్‌ప్రీత్‌ బుమ్రా​ సారథ్యంలోని భారత జట్టు ఆగష్టు 18- 23 వరకు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని యువ జట్టు విండీస్‌తో తొలి టీ20లో ఓటమి పాలైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)