సహారా గ్రూప్నకు చెందిన నాలుగు కోపరేటివ్ సొసైటీల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును తిరిగి ఇచ్చే ప్రక్రియను కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు కేంద్రం ఏర్పాటు చేసిన సహారా రిఫండ్ పోర్టల్ లో నమోదు చేసుకున్న వారిలో 112 మంది డిపాజిటర్లకు తొలి విడతలో భాగంగా రూ. 10 వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 18 లక్షల మంది రిఫండ్ కోసం నమోదు చేసుకున్నారు. సహారాకు చెందిన నాలుగు కోపరేటివ్ సొసైటీల్లో డబ్బు పోగొట్టుకున్న డిపాజిటర్లకు తిరిగి ఆ సొమ్ము ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు. ''కోపరేటివ్ల లక్ష్యాన్ని బలోపేతం చేయాలంటే.. వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం దేశ ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును కాపాడటం ప్రభుత్వం బాధ్యత'' అని షా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డిపాజిటర్లు క్లెయిమ్ చేసిన మొత్తం నగదును పొందుతారని తెలిపారు. సహారా గ్రూప్ సంస్థ సెబీ వద్ద డిపాజిట్ చేసిన రూ.24,979 కోట్ల నుంచి రూ.5,000 కోట్లను సహారా గ్రూప్ కో-ఆపరేటివ్ సొసైటీస్ డిపాజిటర్లకు చెల్లించడానికి సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో అనుమతిచ్చింది. ఆ మొత్తం సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్ ఖాతాలో జమ అయ్యింది. ఈ మొత్తాన్ని రానున్న 9 నెలల్లో 10 కోట్ల మంది మదుపరులకు తిరిగి చెల్లిస్తామని కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇందులో భాగంగా గత నెల 18న అమిత్ షా రిఫండ్ పోర్టల్ను ప్రారంభించారు. రూ.10వేల వరకు డిపాజిట్లు చేసిన వారికి తొలుత చెల్లింపులు చేశాక క్రమంగా ఆ మొత్తాన్ని పెంచుకుంటూ వెళతామని అప్పట్లో అమిత్ షా చెప్పారు. ఈ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలంటే ఆధార్తో అనుసంధానం అయిన రిజిస్ట్రేషన్ నంబర్, ఆదార్ అనుసంధానం అయిన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అని పేర్కొన్నారు. రిఫండ్ మొత్తం ఆయా ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు సంబంధించి దగ్గర్లోని కామన్ సర్వీసు సెంటర్లను ఆశ్రయించొచ్చని డిపాజిటర్లకు షా సూచించారు.
సహారా డిపాజిటర్లకు నిధులు విడుదల చేసిన అమిత్ షా !
August 04, 2023
0
Tags