మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లా కౌరియాకు చెందిన చైనా బారు కచి స్థలంలో అధికారులు విద్యుత్ టవర్ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే అధికారులు ఆమెకు నష్ట పరిహారం ఇవ్వకుండానే టవర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. దీంతో తన బంధువులతో కలిసి ఆమె బుల్డోజర్ని అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు చైనాబారు కచిని జుట్టు పట్టి అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. ఆమెతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. టవర్ నిర్మాణ పనులు అడ్డుకోవడంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నామని, చట్టప్రకారమే వ్యవహరించామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ కేడియా వెల్లడించారు. అది పాత వీడియో అని చెప్పారు. ఆమె ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందని, విద్యుత్ టవర్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని, అందుకే ఆమెను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఆ మహిళను పోలీసులు కొట్టారన్న వార్తను ఖండించారు. మహిళా పోలీసుల నిబంధనల ప్రకారమే వ్యవహరించారని తెలిపారు. అయితే తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా నిర్మాణ పనులు చేపట్టారని చైనా బారు కటి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థ, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది ద్వారా కాంట్రాక్టర్లు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నించారని అన్నారు. ఈ ఘటనపై కలెక్టరేట్, జిల్లా పోలీస్ చీఫ్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఎవరూ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని అన్నారు. సంబంధిత అధికారులు పోలీసులపై చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు ఆమె తెలిపారు.
మహిళపై పోలీసుల దాష్టీకం !
August 17, 2023
0
Tags