నేడు మన్కీ బాత్ 104వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందని ప్రశంసించారు. అలాగే, జీ-20 సమావేశాలపై మాట్లాడారు. కాగా, మోడీ మన్కీ బాత్లో మాట్లాడుతూ సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోందన్నారు. భారత్ జీ-20 అధ్యక్షత బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి గర్వించదగిన పరిణామాలు చాలా చోటు చేసుకున్నయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్ ఈ స్థాయి జీ-20లో భాగస్వామి అవుతోందని.. గ్రూపును మరింత బలోపేతం చేస్తుందన్నారు. జీ-20కి భారత్ నేతృత్వం అంటే ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్లు భావించాలని మోడీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ సదస్సులు జరిగిన నగరాల్లో ప్రజలు విదేశీ అతిథులను సాదరంగా ఆహ్వానించారు. భారత్లోని వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూసి విదేశీ అతిథులు చాలా ప్రభావితమయ్యారు. భారత్కు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని వారు తెలుసుకొన్నారు. జీ-20 సదస్సు శ్రీనగర్లో జరిగిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అలాగే, ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'సంస్కృత భారతీ' ఆధ్వర్యంలో 'సంస్కృతంలో మాట్లాడే క్యాంప్' నిర్వహిస్తారు. ప్రజలకు ఈ భాషను బోధించడంలో భాగంగా జరిగే క్యాంపులో మీరూ పాల్గొనవచ్చు. సంస్కృతం అందరూ నేర్చుకోవాలన్నారు. అంతేకాదు తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నం !
August 27, 2023
0
Tags