సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చే ధైర్యం కేసీఆర్‌కు ఉందా?

Telugu Lo Computer
0


కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చి తీరుతుందని, ఈ విధానాన్ని తీసుకొచ్చిందే తమ పార్టీ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. భారాస ప్రభుత్వం ఉచితాన్ని అనుచితంగా వాడుతోందని, సంవత్సరానికి రూ.8 వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. 24 గంటల విద్యుత్‌పై ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల సవాల్‌ను మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. 'సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చే ధైర్యం కేసీఆర్‌కు ఉందా?' అని ప్రశ్నించారు. నాయకులు షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మల్లు రవి తదితరులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికాలో తానా సభల సందర్భంగా ఏర్పాటు చేసిన 'మీట్‌ అండ్‌ గ్రీట్‌'లో 'కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ పథకాన్ని కొనసాగిస్తారా?' అని ఒకరు అడగ్గా.. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్‌ పరిస్థితి, సాంకేతిక పరమైన అంశాలు, కాంగ్రెస్‌ విధివిధానాల గురించి చెప్పానన్నారు. తాను మాట్లాడిన దాన్ని ముక్కలుగా విడగొట్టి భారాస దుష్ప్రచారానికి దిగిందని దుయ్యబట్టారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ భద్రాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్ల నిర్మాణం పేరిట రూ.45 వేల కోట్ల పనులకు టెండర్లు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కావాల్సినంత విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2.60లకు సరఫరా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా, అనవసరంగా ప్లాంట్లు నిర్మించి అప్పుల పాలు కావద్దని అప్పటి కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. 'రైతులకు ఉచిత విద్యుత్‌ కోసం ఏడాదికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా 12 గంటలకు మించి కరెంటు సరఫరా కానప్పుడు రూ.16 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు? అంటే మిగతా 12 గంటల పేరుతో రూ.8 వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నట్లే కదా?' అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్‌ ఇచ్చి తీరుతామని.. ఈ విషయాన్ని సెప్టెంబరు 17న మేనిఫెస్టోలో ప్రకటిస్తామని రేవంత్‌ స్పష్టంచేశారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో తెదేపాలో కీలక పదవిలో ఉన్న కేసీఆర్‌.. ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కుదరదని చెప్పారని రేవంత్‌ ఆరోపించారు. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటనకు కేసీఆరే కారణమని విమర్శించారు. కేసీఆర్‌తోపాటు భారాసలోని 80% మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని కేసీఆర్‌ సర్వేలోనే తేలిందని రేవంత్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ గజ్వేల్‌ కాకుండా పక్క నియోజకవర్గాల వైపు చూస్తున్నారన్నారు. 24 గంటల విద్యుత్‌పై గతంలో సీబీఐ విచారణ కోరిన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)