జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్ పుల్వామా దాడికి సంబంధించిన వాస్తవాలు బయటపెట్టాక, ప్రజల దృష్టిని మళ్లించడానికే గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయవేత్తగా మారిన అతీఖ్ అహ్మద్, ఆయన సోదరుడిని పాయింట్బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారని పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. ఓ న్యూస్ పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ ఆరోపణ చేశారు. సెక్యూరిటీ ప్రోటోకాల్లోని లొసుగుల కారణంగానే 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడి జరిగి, 40 మంది సిఆర్పిఎఫ్ జవానులు మరణించారని మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్ తెలిపారు. మెహబూబా ముఫ్తీ హిందీలో ట్వీట్ చేశారు. ఉత్తర్ప్రదేశ్ మళ్లీ అరాజకంలోకి, జంగల్ రాజ్లోకి జారిపోయిందన్నారు. చట్టవ్యతిరేక శక్తులు వేడుకలు చేసుకుంటున్నాయి. కోల్డ్ బ్లడెడ్ మర్డర్లు చేస్తున్నాయి అని విమర్శించారు. రైట్వింగర్లు 'జై శ్రీరామ్' అని నినదిస్తూ వేడుకలు చేసుకుంటున్నారన్నారు. పుల్వామా దాడికి సంబంధించి మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్ వెల్లడించిన వాస్తవాల నుంచి దృష్టి మళ్లించడానికే చాలా తెలివిగా ఈ ఘటనకు తెరలేపారన్నారు ముఫ్తీ.
ఉత్తర్ప్రదేశ్ మళ్లీ జంగల్ రాజ్లోకి జారిపోయింది !
April 16, 2023
0
Tags