ప్రియాంక గాంధీ పీఏపై కేసు నమోదు

Telugu Lo Computer
0


ప్రియాంకా గాంధీ వాద్రా వ్యక్తిగత సహాయకుడు సందీప్ సింగ్‌పై వేధింపుల కేసు నమోదయ్యింది. తన కుమార్తెను చంపుతానని సందీప్ బెదిరించినట్టు బిగ్‌బాస్ ఫేమ్, కాంగ్రెస్ నేత అర్చనా గౌతమ్ తండ్రి ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి తనకు ఎదురైన ఘటనను వివరిస్తూ అర్చన కూడా ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేశారు. దీంతో ప్రియాంకా గాంధీ పీఏపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. "ప్రియాంకా గాంధీ అర్చనాను కలవాలని అనుకుంటున్నారని, ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో జరిగే పార్టీ ప్లీనరీకి రావాలని ఆమెకు సందీప్ సింగ్ చెప్పారు. అక్కడికి వెళ్లిన అర్చనతో సందీప్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతోపాటు ఆమెను చంపేస్తానని బెదిరించాడు" అని మేరఠ్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో అర్చనా గౌతమ్ తండ్రి గౌతమ్ బుద్ధా పేర్కొన్నారు. అంతేకాకుండా తన కుమార్తెను కులం పేరుతో దూషించాడని ఆరోపించారు. ప్రియాంకా గాంధీ వద్ద పనిచేసే సందీప్‌సింగ్, అర్చనా గౌతమ్‌ను బెదిరించినట్టు ఫిర్యాదు అందిందని మేరఠ్ ఎస్‌ఎస్‌పీ రోహిత్ సింగ్ సాజ్వాన్ వెల్లడించారు. నిందితుడిపై ఐపీసీ లోని పలు సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. మోడల్‌గా, నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన అర్చనా గౌతమ్ బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. రాజకీయాల్లో చేరిన ఆమె, మేరఠ్ ప్రాంతంలో పట్టున్న దళిత నేతగా కాంగ్రెస్‌లో గుర్తింపు పొందారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)