ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (49) మృతి చెందారు. గత రెండేళ్లుగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కీమో థెరపీతో స్పైనల్ కార్డ్ దెబ్బతింది. కొద్ది రోజులుగా ఆరోగ్యం విషమించడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని వెంగళరావు నగర్ లోని తన ఇంట్లో కందికొండ మరణించారు. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. ఆయన స్వస్థలం నర్సంపేట మండలం నాగుర్లపల్లి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఇంట్రెస్ట్ కారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కందికొండను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఎక్కువగా పూరి జగన్నాథ్ కందికొండకి అవకాశాలు ఇచ్చారు. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' సినిమాలో కందికొండ రాసిన 'మళ్లీకూయవే గువ్వా' అనే పాట శ్రోతలను అలరించింది. ఈ మెలోడీ సాంగ్ తో కందికొండకి మంచి గుర్తింపు లభించింది. దీంతో సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. 'ఇడియట్' సినిమాలో 'చూపులతో గుచ్చి గుచ్చి చంపకే', 'సత్యం' సినిమాలో 'మధురమే మధురమే', 'ఐయామ్ ఇన్ లవ్' ఇలా ఎన్నో హిట్టు పాటలను రచించారు. చివరిగా 'నీది నాది ఒకే కథ' సినిమాలో రెండు పాటలను రాశారు. చాలా కాలంగా ఆయన వెన్నెముక సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి.. కందికొండ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కందికొండకి ట్రీట్మెంట్ అందించారు. కొన్నిరోజుల పాటు ఆరోగ్యం నిలకడగానే ఉన్నామళ్లీ క్షీణించడంతో ఆయన మరణించారు.
గేయ రచయిత కందికొండ కన్నుమూత
March 12, 2022
0
Tags