కరోనా వైరస్ తో రెండేళ్ల నుంచి ప్రపంచదేశాలన్నీ అల్లాడిపోతుండగా తొలిసారిగా ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చిన చైనాలో మాత్రం కోవిడ్ కేసులు కానీ, మరణాలు కానీ పెద్దగా లేవని ఆ దేశ అధికార లెక్కలు చూపిస్తున్నాయి. దీనీకి కారణం తాము అనుసరిస్తున్న కఠిన కోవిడ్ నియంత్రణ చర్యలే అని డ్రాగన్ దేశం చెప్పుకుంటోంది. ప్రపంచ దేశాలకు భిన్నంగా చైనా ముందు నుంచి కరోనా కట్టడికి జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా ఒక్క కేసు బయటపడినా ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేస్తోంది. లాక్డౌన్ విధించి, కోవిడ్ అనుమానితులను బలవంతంగా క్యారంటైన్కు తరలించడం వంటివి చేస్తున్నారు. కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల పౌరులు తమ దేశంలోకి అడుగుపెట్టే విషయంపై చైనా కఠినమైన నియంత్రణల్ని అవలంభిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. విమానాల సర్వీసుల్ని తగ్గించడంతో పాటు "సర్క్యూట్ బ్రేకర్" విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం ఎక్కువ ఇన్ఫెక్షన్ కేసులు వస్తాయని భావించే రూట్లో విమానాలను చైనా నిలిపివేస్తోంది. అయితే ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. అమెరికా నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయని ప్రకటించిన చైనా పౌర విమానయాన సంస్థ ఈ మేరకు అమెరికన్, డెల్టా, యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానాల్ని ఇటీవల చైనా రద్దు చేసింది. దీని కోసం చైనా ఏవియేషన్ అథారిటీ సర్క్యూట్ బ్రేకర్ విధానాన్ని అవలంభించింది. టేకాఫ్కు ముందు ఈ విమానాల్లో ప్రయాణించిన వాళ్లకు నెగెటివ్ ఉందని, తీరా చైనాకి చేరుకున్నాక పాజిటివ్ వచ్చిందని చైనా ఏవియేషన్ ప్రకటించడంపై దుమారం రేగింది. చైనా చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అమెరికా డ్రాగన్ చర్యలను తప్పుబట్టింది. అయితే అమెరికా ప్రభుత్వం నుంచి వెంటనే కౌంటర్ వస్తుందని అంతా భావించారు. కానీ, రోజులు గడిచినా అలా జరగలేదు. అయితే శుక్రవారం అమెరికా నుంచి బీజింగ్కు వెళ్లాల్సిన 44 విమానాల్ని రద్దు చేస్తున్నట్లు ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసి చైనాకు ఝలక్ ఇచ్చింది అమెరికా. ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్, చైనా సదరన్ ఎయిర్లైన్స్, జియామెన్ ఎయిర్లైన్స్కు చెందిన 44 విమానాలు జనవరి 30, మార్చి 29 మధ్య ప్రయాణానికి షెడ్యూల్ చేశాయి. వీటన్నింటినీ కొంతకాలం రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. మరో మూడు వారాల్లో చైనాలో వింటర్ ఒలంపిక్స్ జరగనుండగా.. ఈ నిర్ణయం వెలువడింది. వింటర్ ఒలింపిక్స్ మూడు వారాల ముందుగా చోటు చేసుకున్న ఫ్లైట్ ఫైట్ పరిణామం ఆసక్తికర చర్చకు దారితీసింది. అమెరికా ట్రాన్స్పోర్టేషన్ విభాగం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో "డెల్టా, అమెరికన్, యునైటెడ్ ఎయిర్లైన్స్ కార్యకలాపాలను దెబ్బతీసే చర్యలు ప్రజా ప్రయోజనాలకు ప్రతికూలమైనవి.. విమాన ప్రయాణానికి ముందు ప్రోటోకాల్కు సంబంధించి అన్ని నిబంధనలను అనుసరిస్తున్న అమెరికా ప్రయాణీకులు గమ్యస్థానం చేరిన తర్వాత కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయితే ఎటువంటి జరిమానా ఉండదు" అని పేర్కొంది. అమెరికా తాజా చర్యపై చైనా రాయబారి ప్రతినిధి లియూ పెంగ్యూ వాషింగ్టన్లో మాట్లాడుతూ.. మిగతా దేశాలకు ఒకలా.. చైనాకు ఒకలా నిర్ణయం తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అయితే ఒక్క చైనా విషయంలోనే కాకుండా జర్మనీ, ఫ్రాన్స్ విషయంలో అమెరికా రవాణా విభాగం ఇదే విధానం పాటిస్తోందని ఎయిర్లైన్స్ ఫర్ అమెరికా చెబోతోంది.
చైనా-అమెరికామధ్య ఫ్లైట్ ఫైట్!
January 23, 2022
0
Tags