చైనా జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి పాకిస్తాన్ మొదటి హైపర్స్పెక్ట్రల్ ఉపగ్రహం HS-1ని ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని దేశానికి గొప్ప “సాంకేతిక ముందడుగు”గా పాకిస్తాన్ పేర్కొంది. ఈ మిషన్ విజన్ 2047లో భాగం. దీని వ్యయం దాదాపు ₹8.3 లక్షల కోట్లు. పాకిస్తాన్ దీనిని అమెరికా జాతీయ అంతరిక్ష విధానానికి లోబడి రూపొందించినట్లు పేర్కొంది. అయితే పలువురు నిపుణులు మాత్రం దీనిని “గూఢచారి ఉపగ్రహం” అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ HS-1 ఉపగ్రహం భూమి, అడవులు, నీరు, పట్టణ ప్రాంతాల చిన్న-స్థాయి చిత్రాలను తీయగలదు. దీని అర్థం ఇది పర్యావరణాన్ని పర్యవేక్షించడమే కాకుండా సరిహద్దులు, ప్రాజెక్టులపై కచ్చితమైన నిఘాను కూడా ఉంచగలదు. ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే దాయాది తాజా ప్రయోగం సైన్స్ పురోగతి కోసమా లేదా వ్యూహాత్మక గూఢచర్యం కోసమా? అనేది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని “అంతరిక్ష సహకారంలో చారిత్రాత్మక అడుగు”గా అభివర్ణించింది. దీనిని పాకిస్తాన్ – చైనా స్నేహం లోతును ప్రతిబింబిస్తుందని పేర్కొంది. HS-1 స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులను, ముఖ్యంగా సీపీఈసీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని ఈ ప్రకటనలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఏడాదిలో దాయాది దేశం విజయవంతంగా ప్రయోగించిన మూడవ ఉపగ్రహ ప్రయోగం ఇది. మునుపటి EO-1, KS-1 మిషన్లు కూడా విజయవంతమయ్యాయి. ప్రయోగానికి సంబంధించిన అన్ని సన్నాహాలు పాక్ శాస్త్రవేత్తల సమక్షంలో జరిగాయని దాయాది అంతరిక్ష, ఉన్నత వాతావరణ పరిశోధన కమిషన్ (సుపార్కో) తెలిపింది. కరాచీలోని సుపార్కో కాంప్లెక్స్ నుంచి ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించిందని, రాబోయే రెండు నెలల్లో కక్ష్యలో పరీక్షలు పూర్తయిన తర్వాత ఇది పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తుందని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. సుపార్కో నివేదికల ప్రకారం.. HS-1 ఉపగ్రహం భూమి, పంటలు, నీటి వనరులు, పట్టణ ప్రాంతాల వివరణాత్మక విశ్లేషణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వందలాది స్పెక్ట్రల్ బ్యాండ్లలో కచ్చితమైన చిత్రాలను తీయగలదు. ఇది వ్యవసాయ ప్రణాళిక, పర్యావరణ పర్యవేక్షణకు విశేషంగా సహాయపడనుంది. చైనా-పాక్ ఆర్థిక కారిడార్ కు సంబంధించిన ప్రాజెక్టులకు కొండచరియలు విరిగిపడటం, కాలుష్యం, హిమానీనదం కరగడం వంటి సవాళ్లపై కూడా ఇది డేటాను అందించనుంది.
మొదటి హైపర్స్పెక్ట్రల్ ఉపగ్రహం HS-1ని ప్రయోగించిన పాకిస్తాన్
October 19, 2025
0
Tags