జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ మరోసారి దాడి : పలువురు సైనికులు మృతి

Telugu Lo Computer
0


జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్‌లో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ భీకర దాడికి పాల్పడింది. సింధ్‌-బలూచిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో గల సుల్తాన్‌కోట్‌ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై ఐఈడీ బాంబులు అమర్చి పేల్చింది. అదే సమయంలో క్వెట్టా వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైంది. ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనకు పాక్‌లోని వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్ల బృందం బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ బాధ్యత వహించింది. ప్రమాద సమయంలో పాక్‌ ఆర్మీ సిబ్బంది రైలులో ప్రయాణిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పేలుడు దాటికి అనేక మంది సైనికులు మరణించినట్లు పేర్కొంది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చే వరకూ ఇలాంటి దాడులు కొనసాగుతాయని ఈ సందర్భంగా హెచ్చరించింది. మరోవైపు ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై దాడి జరగడం ఈ ఏడాది ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను పాక్‌లోని వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు హైజాక్‌ చేశారు. అందులోని వందలాది మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్‌ సైనికులను హతమార్చారు. అనంతరం పాక్‌ ఆర్మీ ఆపరేషన్‌ చేపట్టి బందీలను విడిచిపెట్టింది. ఆ తర్వాత జూన్‌లో మరోసారి ఈ రైలును లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. అంతేకాదు ఈ ప్రాంతంలో పాక్‌ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని బలోచ్‌ గ్రూప్‌ వరుస దాడులకు పాల్పడుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)