వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు ఈ బహుమతిని ప్రకటించడంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఎంపిక ప్రపంచ శాంతి పట్ల నిబద్ధతను కాకుండా, రాజకీయ పక్షపాతాన్ని ప్రతిబింబిస్తోందని ఘాటుగా విమర్శించింది. ఈ విషయంపై వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "శాంతి కంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ పెద్దపీట వేస్తుందని మరోసారి రుజువైంది" అని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో నోబెల్ పురస్కారం ఎంపిక ప్రక్రియపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నిరంకుశత్వంలోకి జారుకుంటున్న ప్రస్తుత తరుణంలో, వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మరియా మచాడో చేస్తున్న అలుపెరుగని పోరాటానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. "నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి శాంతియుత, న్యాయబద్ధమైన మార్పు కోసం ఆమె చేస్తున్న కృషికి ఈ పురస్కారం అందిస్తున్నాం" అని ఓస్లో కేంద్రంగా పనిచేసే నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ పురస్కారం కింద మరియా మచాడోకు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ల (సుమారు 1.2 మిలియన్ డాలర్లు) నగదు బహుమతిగా లభించనుంది. ఒకవైపు ప్రజాస్వామ్య పరిరక్షణకు దక్కిన గౌరవంగా కొందరు ప్రశంసిస్తుండగా, మరోవైపు అమెరికా వంటి అగ్రరాజ్యం నుంచి విమర్శలు రావడం గమనార్హం.
నోబెల్ శాంతి పురస్కారం రాజకీయ పక్షపాతాన్ని ప్రతిబింబిస్తోందన్న వైట్ హౌస్
October 10, 2025
0
Tags