తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరుమీద సిటిజన్ సర్వే చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం !

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరుమీద సిటిజన్ సర్వే చేపట్టింది. ఈ సర్వే అక్టోబర్ 10 శుక్రవారం ప్రారంభం కాగా, అక్టోబర్‌ 25వ తేదీ వరకు జరగనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, రాష్ట్రాలు 2047 నాటికి లక్ష్యాలను నిర్దేశించుకోగా, 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ప్రజల అభిప్రాయాలు, సూచనలను ఈ సర్వే ఆధారంగా ఆన్‌ లైన్‌ లో స్వీకరిస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ telangana.gov.in/telanganarising ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇంటింటి సర్వేను చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సర్వే కోసం రూ. 150 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ గణాంకాలను వివిధ ప్రజా సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లకు వినియోగించుకుంది రాష్ట్ర సర్కార్. అయితే తాజాగా మరో సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. 2047 లక్ష్యాలను నిర్దేశించుకుని మీ స్వరం- మీ దృష్టి- మన భవిష్యత్తు నినాదంతో తెలంగాణ రైజింగ్‌ విజన్‌- 2047 పేరుమీద సిటిజన్‌ సర్వేను శుక్రవారం ప్రారంభించింది. అక్టోబర్‌ 25వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేలో ప్రజలంతా పాల్గొనాలని, అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు. ఈ సర్వే కోసం కేవలం 5-6 నిమిషాలు సమయం కేటాయిస్తే చాలని స్పష్టం చేశారు. ఈ సర్వేలో యువకులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వృద్ధులు అన్ని వర్గాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా 8 అంశాలపై సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వేలో భాగంగా మీ ప్రాంతానికి ప్రధానంగా ఏం కోరుకుంటున్నారో అందులో వివరంగా తెలపాలి. మీ జిల్లాకు, లేదా మండలానికి స్కూళ్లు, ఆస్పత్రులు, నగరాల్లో మాదిరిగానే ఉపాధి ఉద్యోగాలు, మహిళలకు భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో అత్యాధునిక సేవలు.. తదితర అంశాలపై ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాలని సర్వేలో వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)