ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఇస్తున్న కాఫీతో పోలిస్తే శాసనమండలిలో ఎమ్మెల్సీలకు ఇస్తున్న కాఫీ నాణ్యత సరిగా లేదంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. దీంతో ఈ వివాదం మొదలైంది. అధికార కూటమికి బలమున్న అసెంబ్లీలో సభ్యులకు ఒకలా, మండలిలో బలం లేదు కాబట్టి మరోలా కాఫీ, టిఫిన్లు ఇస్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. మండలి లో ఇచ్చే కాఫీకి, అసెంబ్లీలో ఇచ్చే కాఫీకి తేడా ఉంటోందని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సైతం నిర్ధారించారు. దీంతో శాసనసభలో, మండలిలో ఒకే రకమైన కాఫీ, భోజనాలు లేవంటూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిపై ప్రభుత్వం తరఫున శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. కాఫీ, భోజనాల్లో అసెంబ్లీకీ, మండలికీ తేడా ఎక్కడా లేదని మంత్రి కేశవ్ వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణపై వైసీపీ సంతృప్తి చెందలేదు. అయితే ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి కేశవ్ వైసీపీ సభ్యులకు హామీ ఇచ్చారు. కాఫీ నాణ్యతపై చర్చకు పట్టుబట్టి వైసీపీ సభను స్తంభింప చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సభను కొద్దిసేపు వాయిదా వేయాల్సి వచ్చింది. అన్నింటికీ మించి ప్రజా సమస్యలపై చర్చించి, వాదోపవాదాలు చేసుకోవాల్సిన మండలి సభ్యులు ఇలా కాఫీ నాణ్యతపై సభను అడ్డుకోవడం, ఆందోళనకు దిగడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే విలువైన సభా సమయం వృథా అవుతోందన్న విమర్శల నేపథ్యంలో ఇలా కాఫీ గొడవలు చేయడం చర్చనీయాంశమైంది.
శాసనమండలిలో విచిత్రమైన వివాదం : కాఫీ నాణ్యత లేదంటూ వైసీపీ ఆందోళన
September 27, 2025
0
Tags