దేశంలో మెసేజింగ్ యాప్‌ల పోటీకి మరో కొత్త ప్లాట్‌ఫామ్ "అరట్టై" !

Telugu Lo Computer
0


చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన 'అరట్టై' యాప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ యాప్‌ను వాట్సాప్‌కు సురక్షితమైన భారతీయ ప్రత్యామ్నాయంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. "అరట్టై ఉచితం, సులభం, సురక్షితం. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించండి" అంటూ ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. 'అరట్టై' అంటే తమిళంలో "సాధారణ సంభాషణ" అని అర్థం. రోజువారీ మెసేజింగ్ అవసరాలను మరింత సులభంగా, భద్రంగా తీర్చడమే దీని లక్ష్యం. దీని ద్వారా టెక్స్ట్ మెసేజింగ్ - వ్యక్తిగతంగా లేదా గ్రూప్‌లో చాట్ చేయగలరు. ఫైల్ & మీడియా షేరింగ్ - చిత్రాలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపే అవకాశం వుంది. వాయిస్ & వీడియో కాల్స్ - ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షిత సంభాషణ. స్టోరీస్ - రోజువారీ అప్‌డేట్స్ పంచుకునే ఫీచర్. ఛానెల్స్ & బ్రాడ్‌కాస్ట్ - వ్యాపార అవసరాలకు ప్రేక్షకులతో నేరుగా కనెక్ట్ అయ్యే సౌకర్యం వుంది. ఈ విధంగా వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా, వ్యాపార అవసరాలకు కూడా అరట్టై ఉపయోగకరంగా ఉంటుంది. అరట్టై భద్రత విషయంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కాల్స్ (వాయిస్, వీడియో) మాత్రమే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ తో అందుబాటులో ఉన్నాయి. కానీ మెసేజ్‌లు మాత్రం పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్‌తో రక్షణ పొందడం లేదు. ఇదే వాట్సాప్‌తో పోలిస్తే ప్రధాన తేడా. వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు రెండింటినీ ఎన్‌క్రిప్షన్‌తో రక్షిస్తుండగా, అరట్టైలో అది ఇంకా పరిమితంగానే ఉంది. ఈ కారణంగా గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులు కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. జోహో కార్పొరేషన్ 1996లో శ్రీధర్ వెంబు, టోనీ థామస్ లు స్థాపించారు. ప్రస్తుతం చెన్నై కేంద్రంగా ఉన్న ఈ సంస్థ, 150 దేశాలలో 130 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈమెయిల్, సీఎంఆర్, హెచ్ ఆర్, అకౌంటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి 55కుపైగా బిజినెస్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, డెలాయిట్, ప్యూమా, టొయోటా, సోనీ, L'Oreal వంటి గ్లోబల్ కంపెనీలు జోహో ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. "Made in India, Made for the World" అనే నినాదంతో గ్లోబల్ మార్కెట్లో పోటీ పడుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాకుండా, ఐటీ & రైల్వేల మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా జోహో ఉత్పత్తులను ప్రశంసించారు. కేబినెట్ సమావేశంలో మైక్రోసాఫ్ట్ పవర్‌పాయింట్ బదులుగా జోహో షో ఉపయోగించి ప్రెజెంటేషన్ సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రస్తుతం అరట్టై యాప్ స్వదేశీ ప్రత్యామ్నాయంగా ఒక స్థానం సంపాదిస్తోంది. ప్రభుత్వం, మంత్రుల మద్దతు, వినియోగదారుల ఆసక్తి కారణంగా దీని ప్రజాదరణ పెరుగుతోంది. జోహో మెసేజింగ్‌లోని భద్రతా లోపాలను పరిష్కరించి, మరిన్ని ఫీచర్లు జోడిస్తే లక్షలాది మంది భారతీయులను ఆకట్టుకునే అవకాశం ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)