పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు : ట్రయల్ రన్ పూర్తి

Telugu Lo Computer
0


వందే భారత్ స్లీపర్స్‌ను తెచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే ఇవి పట్టాలెక్కనున్నాయి. తాజాగా ఈ అంశంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం స్పందించారు. మొదటి రైలు ఇప్పటికే రెడీ అయ్యిందని.. రెండవ రైలు సిద్ధమైన తర్వాతే రెండింటినీ పట్టాలెక్కిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రెండవ రైలు పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అక్టోబర్ 15, 2025 నాటికి పూర్తవుతావుతాయన్నారు. సర్వీసులు సజావుగా నడవడానికి రెండవ రైలు అవసరమన్నారు. ఏయే నగరాల మధ్య నడుస్తాయనే అంశంపై తరువాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే న్యూఢిల్లీ, పాట్నా మధ్య కొత్త రైళ్లు నడుస్తాయనే ఊహాగానాలు ఉన్నాయి. దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగానే రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు గతంలో పలు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. ఈమేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల ఓ వీడియోను షేర్‌ చేశారు. అందులో వందే భారత్‌ స్లీపర్‌ రైలు 180 kmph వేగంతో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లింది. అంత వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సూచనల మేరకు రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)