ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు వద్ద ఒక మహిళ తన భర్తను చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భరణం కేసు విచారణకు హాజరైన మహిళను ఆమె భర్త కోర్టు గుమ్మం వద్దే కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు. సదరు మహిళ వినకపోవడంతో కోర్టు బయటే మూడుసార్లు తలాక్ చెప్పి, దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితురాలు చెప్పుతో చితకబాదింది. 2018లో వివాహమైన ఈ మహిళ పెళ్లి తర్వాత నుంచి భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించారని, తనను తరచూ కొట్టేవారని చెప్పింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను ఇంటి నుంచి గెంటేశారని, అందుకే భరణం కోసం కోర్టులో కేసు వేసినట్లు తెలిపింది. ఈ కేసు విచారణ సమయంలో ఆమె భర్త, అతని తండ్రి కలిసి కోర్టుకు వచ్చారు. విచారణ తర్వాత కోర్టు బయట మహిళను వెంబడించి, కేసు వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేశారు. దీనికి ఆ మహిళ నిరాకరించడంతో భర్త అక్కడే మూడు సార్లు తలాక్ చెప్పి, ఆమెపై దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం ఆమె భర్తను, అతని తండ్రిని చెప్పుతో కొట్టింది. తన పిల్లలను బలవంతంగా తీసుకెళ్లారని, తన జీవితాన్ని నాశనం చేశారని, తనకు న్యాయం కావాలని, పిల్లలను తిరిగి ఇవ్వాలని సదరు మహిళ డిమాండ్ చేసింది. ఈ ఘటనతో కోర్టు ఆవరణలో గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.
కోర్టు వద్దే భర్తను చెప్పుతో కొట్టిన భార్య : వీడియో వైరల్
September 15, 2025
0
Tags