సామర్లకోట లో తల్లీకూతుళ్ల దారుణ హత్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా సామర్లకోటలోని సీతారామ కాలనీలో ఒక ఇంట్లోని తల్లి, ఇద్దరు కుమార్తెలు దారుణ హత్యకు గురయ్యారు. కుమార్తెల్లో ఒకరికి ఎనిమిదేళ్లు కాగా మరొకరికి ఆరేళ్లు కావడం బాధకరం. రోజూలాగే లారీ డ్రైవర్‌గా విధులకు వెళ్లిన తండ్రి ఉదయం ఇంటికి వచ్చిన చూడగా తన భార్య, కూతుళ్లు విగత జీవులుగా రక్తపుమడుగులో పడి ఉండడాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. సామర్లకోట బ్రౌన్‌పేటకు చెందిన లారీ డ్రైవర్‌ ములపర్తి ప్రసాద్‌కు కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి చెందిన మాధురి (26)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ములపర్తి పుష్పకుమారి (8), జెస్సీలోవ(6) కుమార్తెలు ఉన్నారు. ఈ కుటుంబం గత కొంతకాలంగా బ్రౌన్‌పేటకు సమీపాన గల సీతా రామకాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రసాద్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీకి చెందిన వాహనంపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ లాగే శనివారం రాత్రి విధులకు వెళ్లి తిరిగి ఆదివారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఎంతకూ తలుపులు తీయకపోవడం తో వెనక తలపులు తొలగించి లోపలికి వెళ్లగా గదిలో భార్య, కుమార్తెలు విగతజీవులుగా రక్తపు మడుగులో ఉండడాన్ని చూసి షాక్‌తిన్నాడు. దీంతో సామర్లకోట పోలీసులకు సమాచారం అందించాడు. సామర్లకోట సీఐ కృష్ణభగవాన్‌ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోపక్క కాకినాడకు చెందిన క్లూస్‌ టీం బృందాలు సంఘటనా స్థలిలో వేలి ముద్రలను సేకరించడంతో పాటు పోలీసు జాగిలాలను వదిలారు. ముగ్గురినీ తలపై బలమైన ఆయుధంతో గట్టిగా కొట్టి హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా భావించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ హుటాహుటిన సామర్లకోట చేరుకుని సంఘటనకు దారితీసిన పరిస్థితులపై సామర్లకోట పోలీసు అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకర్లతో ఎస్పీ మాట్లాడుతూ తల్లీ, ఇద్దరు కుమార్తెలను హత్య చేసినవారిని తక్షణం అరెస్ట్‌ చేసేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)