రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదు - సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కుంభకర్ణుడిలా నిద్రిస్తున్నారు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. “రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కుంభకర్ణుడిలా నిద్రిస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు. రైతులకు కావలసిన యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. “51 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఒక్క యూరియా బస్తా కూడా తెచ్చే దమ్ములేదు. రైతులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని హరీష్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో రైతుల పాదాలను గోదావరి జలాలతో కడిగారని గుర్తుచేస్తూ “ఇప్పుడు రైతులను పోలీసుల కాళ్లు మొక్కించే పరిస్థితి తెచ్చింది రేవంత్ ప్రభుత్వం” అని ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ఉన్నా రైతుల కోసం ఏమాత్రం కృషి చేయలేదని, రైతుల సమస్యలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని హరీష్ రావు ఆరోపించారు. “ఏ ఎన్నికలు పెట్టినా రైతులే కాంగ్రెస్ కు గుణపాఠం చెపుతారు” అని ఆయన హెచ్చరించారు. తక్షణమే రైతులకు యూరియా అందించకపోతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)