సెప్టెంబరు 7న చంద్ర గ్రహణం కారణంగా దాదాపు 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్టు తితిదే ఒక ప్రకటనలో తెలిపింది. చంద్రగ్రహణం 7న రాత్రి 9.50 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1.31 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. సెప్టెంబరు 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. అదే రోజు సాయంత్రం 3 గంటల నుంచి తిరుమలలో అన్నప్రసాద వితరణ ఉండదు. సెప్టెంబరు 8న ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాదాల పంపిణీ పునః ప్రారంభించనున్నట్టు తితిదే తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా తితిదే అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో 30వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబరు 7న సాయంత్రం నుంచి పంపిణీ చేయన్నట్టు అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్ల అందించనున్నట్టు పేర్కొన్నారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులు సూచించారు.
తిరుమలలో సెప్టెంబర్ 7న శ్రీవారి ఆలయం మూసివేత
August 26, 2025
0
Tags