తెలంగాణలో కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలను వరదలు అతలాకుతలం చేసేశాయి. కామారెడ్డిలో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో టాలీవుడ్ నుంచి ఒక్కొక్కరుగా సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా వరదల వల్ల నష్టపోయిన వారి కోసం తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు సాయం అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తాజాగా ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును అందుకున్నారు. శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో బాలయ్య ఈ సాయాన్ని ప్రకటించాడు. రైతులకు ఈ సాయం ఉపయోగపడాలని కోరారు. వారి కన్నీళ్లను ఎవరూ తుడవలేమని.. కానీ తన వంతుగా ఈ సాయాన్ని ఇస్తున్నట్టు తెలిపారు బాలకృష్ణ. గతంలో ఎన్నడూ లేనంతగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, స్థానిక ప్రజలు చాలా నష్టపోయారని తెలుసుకుని చింతిస్తున్నానని అన్నారు. తాను వారికి అండగా ఉంటానని బాలకృష్ణ తెలిపారు.
తెలంగాణ వరద బాధితులకు రూ.50 లక్షలు సాయం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ
August 31, 2025
0
Tags