అమెరికాలో 2019 నాటి రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థ తప్పిదమే ప్రమాదానికి కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్దారించింది. దీంతో బాధితులకు 242 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. నాటి ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడ్డారు. 2019లో ఫ్లోరిడాలోని కీ లార్గోలో ఈ ఘటన చోటుచేసుకుంది. జార్జ్ మెక్గీ అనే వ్యక్తి తన టెస్లా కారులో వెళ్తూ అధునాతన ఆటోపైలట్ ఫీచర్ను ఉపయోగించాడు. ఇది టెస్లా అందించిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ వ్యవస్థ. మార్గమధ్యలో తన మొబైల్ ఫోన్ కారులో కింద పడిపోయింది. ఎలాగూ కారు ఆటోపైలట్ మోడ్లోనే ఉందని భావించిన జార్జ్ కిందకు వంగి ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కారు అదుపుతప్పి పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ కారును ఢీకొట్టి ఇద్దరు వ్యక్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద తీవ్రతకు యువతి మృతదేహం 75 అడుగుల దూరంలో ఎగిరిపడింది. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ప్రమాదానికి గానూ బాధితుల కుటుంబాలకు 329 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆటోపైలట్ వ్యవస్థ తప్పిదం కూడా ప్రమాదానికి ఓ కారణమేనని గుర్తించిన కోర్టు.. ఇందుకు గానూ పరిహారంలో మూడోవంతు అంటే దాదాపు 242 మిలియన్ డాలర్లు టెస్లా కంపెనీ చెల్లించాలని ఆదేశించింది. మిగతా మొత్తం సదరు వాహన డ్రైవర్ ఇవ్వాలని స్పష్టంచేసింది. అయితే, ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు టెస్లా తెలిపింది.
టెస్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థ తప్పిదం కారణంగా రూ.2,100కోట్ల జరిమానా
August 02, 2025
0
Tags