ఇన్ఫోసిస్ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా, భారత యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించేందుకు స్ప్రింగ్బోర్డ్ లైవ్లీ హుడ్ ప్రోగ్రామ్ అనే విభిన్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 15, 2025న ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్ను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 2030 నాటికి కనీసం 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రూ. 200 కోట్ల పెట్టుబడిని ఈ ప్రారంభ దశకు కేటాయించారు. ఇది ముఖ్యంగా పట్టభద్రులు, స్కిల్ లేని నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత యువతకు మౌలిక నైపుణ్యాలు మరియు ప్రొఫెషనల్ శిక్షణ అందించేందుకు రూపొందించబడింది. ఇప్పటికే 2025 ఆర్థిక సంవత్సరంలో 80,000 మందికి పైగా అభ్యర్థులు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందారు. ఇన్ఫోసిస్ ఈ ప్రోగ్రామ్ ను బ్యాచిలర్ విద్యార్థులకే కాకుండా, గ్రాడ్యుయేట్లు, అలాగే STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథ్స్) మరియు non-STEM రంగాలలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలనుకునే అభ్యర్థులకు కూడా ఉద్యోగ అవకాశాలను అందించడంపై దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమంలో యువతకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్ వంటి సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. అదనంగా, కమ్యూనికేషన్ స్కిల్స్, టైమ్ మేనేజ్మెంట్, ఇంటర్వ్యూకు సిద్ధంగా ఉండేలా చేసే సోఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా అందించబడుతోంది. రియల్ టైమ్ ప్రాజెక్టుల ద్వారా అభ్యర్థులకు ప్రాక్టికల్ అనుభవం కల్పించేందుకు అనేక సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పడినాయి. ప్రస్తుతం ఈ జీవనోపాధి కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 80,000 మందికిపైగా ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ - IDC అకాడమీ, NIIT అకాడమీ, మ్యాజిక్ బస్, అగా ఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్, నిర్మాణ్ వంటి సంస్థలతో కలిసి పని చేస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమం ఉద్యోగ అవకాశాల కంటే ఎక్కువగా, యువతలో ఆత్మవిశ్వాసం మరియు భవిష్యత్పై ఆశను పెంపొందించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మాని మాట్లాడుతూ "భారతదేశంలో పరిశ్రమలు, ముఖ్యంగా AI రంగం, వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నైపుణ్యాల పెంపకం అత్యవసరమైంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ జీవనోపాధి కార్యక్రమం రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ యువతకు కేవలం శిక్షణే కాదు మెరుగైన భవిష్యత్తు దిశగా గైడెన్స్ కూడా అందిస్తోంది. ఇది వారికి విజ్ఞానంతోపాటు ఉద్యోగావకాశాలను కూడా తెరవనుంది" అని అన్నారు. ఉన్నతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమేష్ స్వామి మాట్లాడుతూ, "నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని గుర్తించి, యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొస్తుండటం అభినందనీయం. ఈ సహకార ప్రయత్నం లక్షల మంది యువతకు కొత్త ఆశలు, అవకాశాలు అందించగల శక్తి కలిగినది. ఇది కేవలం శిక్షణ కార్యక్రమం కాదు భారత యువత జీవితాల్లో నిజమైన మార్పుకు దారితీయగల ఉద్యమం," అని అభిప్రాయపడ్డారు.
స్ప్రింగ్బోర్డ్ జీవనోపాధి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇన్ఫోసిస్
July 16, 2025
0
Tags