కేసీఆర్ అబద్దాలు చెప్పడం వల్లే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది !

Telugu Lo Computer
0


గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అబద్దాలు చెప్పడం వల్లే అధికారాన్ని కోల్పోయారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు సైతం కోల్పోయారని చెప్పారు. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు సైతం దొరకలేదని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం ఆ పార్టీ నేతలు తాపత్రయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకోసమే నీళ్ల సెంటిమెంట్‌ను వాడుకోవాలని చూస్తున్నారంటూ ఆ పార్టీ నేతలపై ఆయన మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఆ నీళ్ల సెంటిమెంటే బీఆర్ఎస్ పార్టీని బతికిస్తుందని వాళ్లు అనుకుంటున్నారన్నారు. అందుకోసం పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుతోపాటు తెలంగాణ ప్రభుత్వాన్ని భూతాలుగా చూపుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలను విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని క్షుద్రపూజలు చేసినట్లుగా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఇదొక్కటే పార్టీకి జీవనాదారం అనుకుంటున్నారన్నారు. అందుకోసమే తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల నీటి హక్కులను కాపాడాల్సి ఉందన్నారు. నీటితో తెలంగాణ ప్రజలకు అనుబంధం ఉందని గుర్తు చేశారు. నీళ్ల విషయంలో అందరిదీ ఏకాభిప్రాయమేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశాయి. బీఆర్ఎస్ నేతలు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు శాపంగా మారాయన్నారు. నీళ్లలో జరిగిన అన్యాయమే ప్రత్యేక రాష్ట్ర సాధనకు పునాది పడిందని గుర్తు చేశారు. తెలంగాణ జలాల విషయంలో రాజీ పడేది లేదని కుండబద్దలు కొట్టారు. సాంకేతికంగా, రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖను కేసీఆర్‌, హరీష్‌రావు చూశారని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ నీటి హక్కులను వాళ్లు కాపాడతారని అంతా భావించారని.. కానీ వాళ్లే రాష్ట్రానికి నష్టం చేశారంటూ బీఆర్ఎస్ అగ్రనేతలపై ఆయన నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో నీటి హక్కుల కోసం చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో గత ప్రభుత్వ నిర్ణయాలు మనకు గుదిబండగా మారాయని వివరించారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాజెక్టులను గత ప్రభుత్వం పూర్తి చేయలేదని గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారన్నారు. ఈ 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని 2015లో నాటి సీఎం కేసీఆర్ సంతకం చేశారని వివరించారు. అలాగే 68 శాతం జలాలు ఏపీకి కేటాయిస్తే తమకు ఏం అభ్యంతరం లేదని కూడా సంతకం చేశారన్నారు. 299 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారని మండిపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సైతం మొగ్గు చూపలేదన్నారు. ఏపీ పూర్తి చేసిన ప్రాజెక్టులకు నీటిని తరలించుకు పోతోందని చెప్పారు. ఉమ్మడి ఏపీలో రూ. 38 వేల కోట్లతో ప్రాణహిత - చేవెళ్లను చేపట్టారన్నారు. ప్రాణహిత - చేవెళ్లను పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టారని వివరించారు. కమీషన్లకు కక్కుర్తిపడి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని చెప్పారు. రూ. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టుతో 168 టీఎంసీలు మాత్రమే ఎత్తి పోశారని గుర్తు చేశారు. 168 టీఎంసీలు ఎత్తి పోసేందుకు రూ. 7 వేల కోట్ల కరెంట్ బిల్లు ఖర్చయిందని వివరించారు. ఎత్తి పోసిన 168 టీఎంసీల్లో మళ్లీ 112 టీఎంసీలు వృథాగా కిందకు వదిలారన్నారు. చచ్చిన పార్టీని బతికించుకునేందుకు మళ్లీ జలాల సెంటిమెంట్‌ను ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. ఏపీని బూచిగా చూపి పార్టీని బతికించుకునేందుకు ఫామ్‌ హౌస్‌లో క్షుద్ర పూజలు చేశారని చెప్పారు. గత 10 ఏళ్లలో 220 టీఎంసీలకు మించి సద్వినియోగం చేసుకోలేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన నీటి హక్కులను సద్వినియోగం చేసుకునే వాళ్లమన్నారు. కృష్ణా జలాల హక్కుల కోసం కేసీఆర్ ఏనాడు పోరాడలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)