అమెరికా విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తానంటూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగింపు కార్యక్రమంలో లూలా మాట్లాడుతూ 'ప్రపంచం మునుపటిలా లేదు మారిపోయింది. కాబట్టి మనకు చక్రవర్తి అవసరం లేదు. మన దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగిఉన్నాయి. ట్రంప్ సుంకాలను జారీ చేస్తే ఇతర దేశాలకు అదే చేసే హక్కు ఉంది. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ఆయన సుంకాల గురించి సోషల్ మీడియాలో ప్రపంచాన్ని బెదిరించడం బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నా. ఇలాంటి అంశాలపై ఇతర దేశాలతో మాట్లాడేందుకు చాలా వేదికలు ఉన్నాయి' అని పేర్కొన్నారు. ఒకరిని ఎదుర్కోవడం కోసం బ్రిక్స్ ఎవరికీ హాని చేయదని, కానీ రాజకీయాలు చేసేందుకు మరో ఉదాహరణ ఉండాలని మాత్రమే ఈ కూటమి కోరుకుంటోందని లూలా వ్యాఖ్యానించారు. బ్రిక్స్ సదస్సు జరుగుతున్న వేళ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఒక పోస్టు పెట్టారు. అందులో 'బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా 10 శాతం టారిఫ్లు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు' అని పేర్కొన్నారు. ట్రంప్ హెచ్చరికలపై చైనా ఆచితూచి స్పందించింది. బ్రిక్స్ ఘర్షణను కోరుకునే కూటమి కాదని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ స్పష్టం చేశారు. ఏ ఒక్క దేశాన్నీ అది లక్ష్యంగా చేసుకోదన్నారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలపై వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన లీవిట్ మాట్లాడుతూ బ్రిక్స్ సదస్సును ట్రంప్ నిశితంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అందులోని దేశాలు బలపడుతున్నాయని ఆయన అనుకోవడం లేదన్నారు. కానీ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్ భావిస్తున్నారన్నారు. అమెరికా ఫస్ట్ విధానానికి అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారని తెలిపారు.
ట్రంప్ సుంకాలు జారీ చేస్తే ఇతర దేశాలకు అలా చేసే హక్కు ఉంది !
July 08, 2025
0
Tags