హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ఆవరణలోని సంప్లో పడి బాలుడు మృతి చెందాడు. ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా ఖిలాఘన్పూర్ మండలానికి చెందిన సభావత్ శ్రీను, నీల దంపతులకు ఓ కూతురు, కుమారుడు (4) ఉన్నారు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం వలస వచ్చి నగరంలో మియాపూర్ హఫీజ్పేట్ సుభాష్చంద్రబోస్ నగర్ కాలనీలో నివాసముంటూ స్థానికంగా సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. బాలుడు అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం శ్రీను, నీల దంపతులు కూలిపనుల నిమిత్తం వెళ్లగా కూతురు అఖిల, కుమారుడు అభి ఇంటి వద్ద ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో బాలుడు అభి ఇంటి ఆవరణంలో ఉన్న సంపులో నుంచి నీటిని తీసుకునేందుకు వెళ్లి అందులో పడిపోయాడు. సమీపంలో ఆడుకుంటూ ఉన్న అఖిల చూసి స్థానికులకు చెప్పడంతో అభిని సంపులోంచి బయటకు తీసి సమీపంలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. సంపుపై మూత ఏర్పాటు చేయాలని ఇంటి యజమానికి పలుమార్లు చెప్పి నా పట్టించుకోలేదని, దీంతో తమ కుమారుడు మృత్యువాత పడినట్లు అభి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మియాపూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంప్లో పడి బాలుడి మృతి
July 13, 2025
0
Tags