భర్తతో బైక్‌పై వెళ్తున్న సమయంలో తన కాలుపై నుంచి పోనిచ్చాడని ఆటో డ్రైవర్‌ని చెప్పుతో కొట్టిన మహిళ !

Telugu Lo Computer
0


బెంగళూర్‌లో ఒక మహిళ ఆటో డ్రైవర్‌ పై చెప్పుతో దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఈ సంఘటనలో మహిళను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పంఖూరి మిశ్రా అనే మహిళ ఆటో డ్రైవర్‌ లోకేష్‌ను చెప్పుతో కొట్టింది. పంఖూరి తన భర్తతో బైక్‌పై వెళ్తున్న సమయంలో, ఆటో డ్రైవర్ తన కాలుపై నుంచి పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. అయితే, డ్రైవర్ ఆమె వాదనల్ని తోసిపుచ్చాడు. వాదన సమయంలో లోకేష్ ఈ సంఘటనను వీడియో తీశాడు. సదరు మహిళ '' వీడియో తీస్తావా, తీయి'' అంటూ తన చెప్పుతో పదే పదే డ్రైవర్ లోకేష్‌పై దాడి చేసింది. అయితే, ఆటో డ్రైవర్ వారే తప్పుగా వస్తున్నారని ఆరోపించారు. స్థానిక కన్నడ భాషలో కాకుండా హిందీలో ఆ మహిళ వాగ్వాదానికి దిగడంతో తాను రికార్డ్ చేసినట్లు లోకేష్ చెప్పారు. అయితే, ఈ మొత్తం ఘటన తర్వాత మహిళ, ఆమె భర్త ఆటో డ్రైవర్‌కి క్షమాపణలు చెప్పారు. అతడి పాదాలకు నమస్కరించి క్షమించాలని కోరారు. ''క్షమించండి. నేను గర్భవతిని. కాబట్టి, నాకు గర్భస్రావం జరిగితే ఏమి జరుగుతుందో అని నేను భయపడ్డాను'' అని ఆమె డ్రైవర్‌తో చెప్పింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆమె హిందీలో మాట్లాడటం, కన్నడ వ్యక్తిని చెప్పుతో కొట్టడం వంటి వాటిపై ఉద్రిక్తత చెలరేగింది. బీహార్ నివాసి అయిన పంఖూరి తనకు కన్నడ ప్రజల పట్ల ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. మేము బెంగళూర్‌ని ప్రేమిస్తున్నామని, మేము ఇక్కడి సంస్కృతి, ప్రజల్ని ప్రేమిస్తున్నామని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)