కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ఆసక్తికరమైన అంశం వెలుగుచూసింది. రన్యారావును గత నవంబర్లో పెళ్లి చేసుకున్నానని, డిసెంబర్ నుంచి ఇద్దరం విడివిడిగా ఉంటున్నామని ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టులో వెల్లడించారు. అయితే తాము అధికారికంగా విడిపోలేదని, కొన్ని కారణాల వల్ల విడివిడిగా ఉంటున్నామని ఆయన తెలిపారు. అరెస్టు నుంచి తనను మినహాయించాలని కోరుతూ హుక్కేరి వేసిన పిటిషన్లో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడంచారు. దీంతో తదుపరి విచారణ వరకూ హుక్కేరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు గత గురువారంనాడు ఆదేశాలిచ్చింది. హుక్కేరి తరఫున ఆయన లాయర్ ప్రభులింగ్ నవడగి ఈ పిటిషన్ వేశారు. కాగా, తదుపరి విచారణ జరిగే వరకూ హుక్కేరిపై ఎలాంటి చర్య తీసుకోవద్దని కోర్టు ఇచ్చిన ఆదేశాలపై డెరెక్టరేట్ ఆప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) మధురావు మాట్లాడుతూ, ఈనెల 24న తదుపరి విచారణ సందర్భంగా తమ అభ్యంతరాలను కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. రన్యారావుతో తనకున్న అనుబంధం దృష్ట్యా కస్టడీలోకి తీసుకునే అవకాశాలున్నాయనే భయంతో కర్ణాటక హైకోర్టును హుక్కేరి ఇటీవల ఆశ్రయించారు. దీంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మార్చి 11న కోర్టు ఆదేశాలిచ్చింది. రన్యారావుకు వివాహం అయినప్పటి నుంచి తనకు దూరంగా ఉంటోందని ఆమె సవతి తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రరావు చెప్పడంతో హుక్కేరి పేరు ప్రచారంలోకి వచ్చింది. మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రన్యారావు నుంచి 14 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాను అమాయకురాలినని, ఈ కేసులో తనను ఇరికించారని చెబుతున్న రన్యారావు, తనను డీఆర్ఐ విచారణలో అధికారులు మానిసికంగానే కాకుండా శారీరకంగా కూడా టార్చర్ పెట్టారని కోర్టులో తెలిపారు.
ఇద్దరం విడివిడిగా ఉంటున్నాం : రన్యారావు భర్త జతిన్ హుక్కేరి
March 17, 2025
0
Tags