తెలంగాణలోని భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నదని, ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. కాగా, శిథిలా నుంచి కామేశ్ ఆర్తనాలు విన్న రెస్క్యూ, ఫైర్ సిబ్బంది.. సుమారు గంటా 45 నిమిషాలు శ్రమించి అతడిని వెలికితీశారు. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు. శిథిలాల కింద మరొకరు ఉన్నట్లు తెలుస్తున్నది. భద్రాచలం పట్టణంలోని రామాలయం సమీపంలో ఓ పాత భవనంపై శ్రీపతి నేషనల్ సేవా ట్రస్టు పేరిట మరో ఐదంతస్తులు నిర్మిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కూడా పనులు కొనసాగుతుండగా, భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల్లో ఎంతమంది చిక్కుకున్నారనే విషయం మాత్రం తేలడం లేదు. మరోవైపు ఇద్దరు మాత్రమే పనుల్లో ఉన్నట్టు భవన యజమాని, అధికారులు చెప్తున్నారు. భద్రాచలానికి చెందిన పడిశాల ఉపేందర్ రావు, చల్లా కామేశ్ తో పాటు మరికొందరు పనుల్లో ఉన్నట్టు స్థానికులు తెలిపారు.
భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఒకరు మృతి !
March 27, 2025
0
Tags