యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. అదో ఓ నేర సంస్థ అని మస్క్ దుయ్యబట్టగా, దానిని రాడికల్ మూర్ఖులు నడుపుతున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అటువంటి వారిని తొలగించి, సంస్థ భవిష్యత్ కార్యాచరణపై తాను నిర్ణయం తీసుకుంటానని అధ్యక్షుడు వెల్లడించారు. అమెరికా ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో యూఎస్ఎయిడ్ విదేశాల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేస్తుంటే, వారు ఆ డబ్బుతో కొవిడ్ వంటి ప్రమాదకర వ్యాధులను పుట్టించడానికి పరిశోధనలు చేస్తున్నారని మస్క్ ఆరోపించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాలకు అమెరికా అందించే అన్నిరకాల సాయాన్ని 90 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేసిన విషయం తెలిసిందే. విదేశాలకు అందించే సాయం అమెరికా విధానాలకు అనుగుణంగా ఉందా? లేదా? అనేది వారు సమీక్షిస్తున్న నేపథ్యంలో యూఎస్ఎయిడ్ పనితీరుపై వారు విమర్శలు గుప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఏర్పడిన డోజ్ విభాగానికి.. వేతనాలకు సంబంధించిన ట్రెజరీ యాక్సెస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూఎస్ఎయిడ్కు ప్రభుత్వం నుంచి అందే నిధులపై కత్తెర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దీనిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందకు తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ను ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాల్లో భాగం చేయడాన్ని డెమోక్రటిక్ సెనెటర్ క్రిస్ మర్ఫీ ఖండించారు. దేశ రహస్య సమాచారాన్ని మస్క్ చేతిలో పెట్టడం, డోజ్కు ఎక్కువ హక్కులు ఇవ్వడం వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్పై డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు!
February 03, 2025
0
Tags