తమిళనాడు గవర్నర్ 'ఎట్ హోమ్' రెసెప్షన్‌కు అధికార పార్టీ బాయ్‌కాట్

Telugu Lo Computer
0


రిపబ్లిక్ సందర్భంగా జనవరి 26న రాజ్‌భవన్‌లో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్‌ రవి ఏర్పాటు చేసిన "ఎట్ హోమ్'' రెసెప్షన్‌ను అధికార డీఎంకే బాయ్‌కాట్ చేసింది. డీఎంకే భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే ఇప్పటికే గవర్నర్ టీ పార్టీని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో డీఎంకే సైతం 'ఎట్ హోమ్' రెసెప్షన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌గా రవి నియమితులైనప్పటి నుంచి తమిళనాడు ప్రజలకు, ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై ఆరోపించారు. యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించలేదని, అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లులకు సైతం గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా జాప్యం చేస్తున్నారని తెలిపారు. గవర్నర్ చర్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. గవర్నర్‌గా తన విధులను ఆర్ఎన్ రవి సక్రమంగా నిర్వహించడం లేదని, ఆ కారణంగానే రాజ్‌భవన్‌లో ఏర్పాటు టీ పార్టీని బహిష్కరిస్తు్న్నామని సీపీఎం, సీపీఐ రాష్ట్ర విభాగాలు, తిరువాళగన్ సారథ్యంలోని విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) ప్రకటించాయి. కాగా, గత ఏడాది కూడా గవర్నర్ "ఎట్ హోమ్'' రెసెప్షన్‌ను ఎండీఎంకే సహా డీఎంకే భాగస్వామ్య పార్టీలన్నీ బాయ్‌కాట్ చేశాయి. 'నీట్' అంశంతో సహా రాష్ట్రంలోని పలు అంశాలపై గవర్నర్, డీఎంకే మధ్య చాలాకాలంగా సయోధ్య లేదు. తమిళనాడులోని విశ్వవిద్యాలయలకు వీసీల నియామకం విషయంలో గవర్నర్‌కు, డీఎంకే ప్రభుత్వాన్ని మధ్య జరుగుతున్న గొడవపై ఇటీవలే రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో సమస్యను కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలని, పరిష్కరించుకోకుంటే తామే జోక్యం చేసుకుని పరిష్కరించాల్సి వస్తుందని జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)