హైదరాబాద్ లోని నాంపల్లి నుమాయిష్ 2025 ఎగ్జిబిషన్ లో పిల్లల అమ్యూజ్మెంట్ రైడ్లో ఉండే డబుల్ ఆర్మ్ రేంజర్ సరిగా పనిచెయ్యకపోవడంతో దాదాపు 20 నిమిషాలపాటు సందర్శకులు నరకం చూశారు. సాధారణంగా డబుల్ ఆర్మ్ రేంజర్ ఎంతో థ్రిల్ ఇస్తుంది. అందులో కూర్చునేవారు రివర్సులో టర్న్ అవుతారు. రెండు ఆర్ములూ పైకి లేస్తూ రౌండ్గా తిరుగుతాయి. దాంతో థ్రిల్ పొందుతూ కేరింతలు కొడతారు. అయితే నిన్న రాత్రి మాత్రం కేరింతలు కాదు, గావుకేకలు పెట్టారు. ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు. సందర్శకులు ఎక్కిన తర్వాత డబుల్ ఆర్మ్ రేంజర్, ఆర్ములు కదలడం ప్రారంభించాయి. కొన్ని క్షణాల తర్వాత అవి పైకి లేచాయి. కానీ కిందకు దిగలేదు. మెషిన్లో టెక్నికల్ సమస్య రావడంతో రెండు చేతులూ పైకి లేచి గాల్లో ఉండిపోయాయి. దాంతో లోపలున్న సందర్శకులు తమ పరిస్థితి ఏంటని నానా హైరానా పడ్డారు. వాళ్లు సీట్లలో కూర్చునే పరిస్థితి లేదు. రివర్సులో వేలాడుతూ ఉన్నారు. ఆ తర్వాత ప్రత్యేక టీమ్ యంత్రాన్ని పరిశీలించి, సమస్యను పరిష్కరించింది. ఇందుకు 20 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత సందర్శకులను తిరిగి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అప్పటికే చాలా సేపు తలకిందులుగా ఉండటంతో కొంతమంది తమకు అస్వస్థతగా ఉందని చెప్పడంతో.. వారిని ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ అవుట్పోస్టులకు తీసుకెళ్లారు. కొంతమందికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఈ ఘటనతో విమర్శలు రావడంతో అన్ని జాయ్రైడ్లనూ పరిశీలించాలని ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ని పోలీసులు కోరారు.
నాంపల్లి ఎగ్జిబిషన్లో డబుల్ ఆర్మ్ రేంజర్ సరిగా పనిచెయ్యకపోవడంతో 20 నిమిషాల పాటు సందర్శకులకు నరకం
January 17, 2025
0
Tags