బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ ఉగ్రరూపాన్ని ధరించింది. పెను తుఫాన్గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ఫలితంగా తిరుమలలో కుండపోత వర్షపాతం నమోదైంది. ఈ ఉదయం 11:30 గంటల సమయానికి ఈ తుఫాన్ పుదుచ్చేరికి తూర్పు- ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 250, నెల్లూరు- 340, బాపట్ల- 360, మచిలీపట్నం- 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 4వ తేదీన సాయంత్రం బాపట్ల- మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వణికిస్తోన్నాయి. రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 48 గంటల పాటు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని, 204.4 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఏపీ, తమిళనాడుకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. తీర ప్రాంతంతో పాటు వాటికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని హెచ్చరించింది. వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఏపీలో. తీరానికి సమీపించకముందే తన ప్రతాపాన్ని చూపిస్తోంది మిఛౌంగ్ తుఫాన్ . తిరుపతిలో అతి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల వల్ల తిరుపతి జిల్లాలోని ఏర్పాడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు యశ్వంత్ మరణించినట్లు తెలుస్తోంది. ఇక నెల్లూరు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. శనివారం నుంచీ ఏకధాటిగా ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తోన్నాయి. తుఫాన్ తీరానికి సమీపించిన తరువాత వర్షాల తీవ్రత మరింత ఉధృతమౌతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తిరుమలలో కుండపోతగా వర్షం !
December 03, 2023
0
Tags