ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయవాడకు చేరుకున్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను రిసీవ్ చేసుకోవడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వయంగా రావడం విశేషం. తర్వాత వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పీకే పనిచేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ విషయంపై గత కొంతకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబుతో పీకే భేటీ అవడంతో ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు మారాయి. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీలో ప్రశాంత్ కిశోర్తో నారా లోకేశ్ సమావేశమయ్యారు. వీరిద్దరు ఎన్నికలపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. గత ఏపీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వైసీపీ తరఫున పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. అప్పట్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ సారి జనసేనతో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేసింది.
చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ !
December 23, 2023
0
Tags