మధుమేహ వ్యాధిగ్రస్తులుకు వరం మాగ్నటిక్‌ జెల్‌ !

Telugu Lo Computer
0

ధుమేహ వ్యాధిగ్రస్తులు కాలిన గాయాలు, చర్మంపై మానని గాయాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మధుమేహంతో బాధపడుతున్న వారిలో అల్సర్లు నెమ్మదిగా నయం అవుతాయి. ఒక్కోసారి శరీర భాగాలను తొలగించాల్సి వస్తుంది. ఇలాంటి వాటికి పరిష్కారంగా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ మాగ్నటిక్‌ జెల్‌ను రూపొందించింది. ఇది మృత చర్మకణాల చికిత్సలో మూడు రెట్లు సమర్ధ వంతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. కాలిన గాయాలు, డయాబెటిక్‌, నాన్-డయాబెటిక్, తదితర దీర్ఘకాలిక అల్సర్‌ల చికిత్సలో మూడు రెట్లుగా మెరుగ్గా పనిచేస్తుందని అధ్యయన వేత్తలు తేల్చారు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో జెల్ చికిత్స స్కిన్‌ ఫైబ్రోబ్లాస్ట్‌ల వృద్ధి రేటును సుమారు 240 శాతం పెంచింది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి రేటును రెట్టింపు చేసింది. ఈ జెల్‌ కెరాటినోసైట్లు, ఇతర కణాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచిందని, తద్వారా గాయపడిన ప్రదేశంలో కొత్త రక్తనాళాల పెరుగుదలకు తోడ్పడిందని వెల్లడించారు. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సన్ యాట్-సేన్ యూనివర్శిటీ, వుహాన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. "వైర్‌లెస్ మాగ్నెటిక్ -రెస్పాన్సివ్ హైడ్రోజెల్ చర్మపై గాయాల్ని నయం చేయడంలో ప్రాథమిక సవాళ్లను అధిగమించిదని పరిశోధన వేత్త డాక్టర్ షౌ యుఫెంగ్ తెలిపారు. ఈ మాగ్నటిక్‌ జెల్‌ను గాయానికి నేరుగా బ్యాండేజ్‌లో అమరుస్తారు. ఇందులో ఎఫ్‌డీఏ ఆమోదిత అతి చిన్న అయస్కాంత సెల్స్‌ కెరాటినోసైట్‌లు (చర్మాన్ని బాగు పర్చడంలో), ఫైబ్రోబ్లాస్ట్‌లు (చర్మంపై కణాల మధ్య సమన్వయం) కీలక పాత్ర పోషిస్తాయి. గాయంపై ఉంచిన మాగ్నటిక్‌ డివైస్‌ ద్వారా వెలువడిన అయస్కాంత కణాలు నెమ్మదిగా కదులుతూ, రోగి చర్మ కణాలతో మిళితమై కొత్త కణాల వృద్ధికి తోడ్పడతాయి. ఈ అయస్కాంత స్టిమ్యులేషన్‌ పరికరంపై సంబంధిత అవయవాన్ని రెండు నుండి మూడు గంటల పాటు ఉంచితే సరిపోతుందని అధ్యయన వేత్తలు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)