కర్ణాటకలోని బెంగళూరు శివాజినగర్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య సెయింట్ బెసిలికా చర్చిలో ఏర్పాటైన మేరీ మాత ఉత్సవాల ప్రధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ దేశంలో అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు అన్నివర్గాల ప్రజలు హాజరవుతుంటారని, మత సామరస్యానికి ఇదే గొప్ప ఉదాహరణ అని చెప్పారు. సెయింట్ బాసిలికా చర్చి కూడా సర్వమత సమైక్యతకు చిహ్నంగా ఉందన్నారు. మత విద్వేషాలు ప్రజలను విడగొడతాయని, సామరస్యంతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం పేర్కొన్నారు. ఏ మతం కూడా ఇతర మతాలను ద్వేషించమని చెప్పదని, కొందరి స్వార్థం వల్లే సమాజంలో అశాంతి వాతావరణం ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవులు ఆరోగ్య, విద్యారంగంలో అద్భుతంగా రాణిస్తూ సమాజానికి చక్కటి సేవలందిస్తున్నారని సీఎం కొనియాడారు. శివాజీనగర్ మెట్రో రైల్వేస్టేషన్కు సెయింట్ మేరీస్ పేరుపెట్టే అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. బడ్జెట్లో ప్రకటించిన మేరకు త్వరలోనే క్రైస్తవ అభివృద్ధి కార్పొరేషన్ను ఏర్పాటు చేసి అర్హులైన వారిని అధ్యక్షులుగా నియమిస్తామని సీఎం ప్రకటించారు. శివాజీనగర్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్, ఆర్చ్ బిషప్ డాక్టర్ పీటర్ మచాడోతో పాటు క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. ఉత్సవాల చివరిరోజైన శుక్రవారం వాడవాడలా మేరీ మాత రథోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సర్వ మతాల సంక్షేమమే మా లక్ష్యం !
September 09, 2023
0
Tags