ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఒక యువకుడు మృతిచెందిన నేపధ్యంలో అతని అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి అతని స్నేహితుడు అదే చితిలో పడిపోయి, తీవ్రంగా గాయపడ్డాడు. నగ్లా ఖంగ్రా పరిధిలోని మాడయి గ్రామానికి చెందిన 32 ఏళ్ల అశోక్ కుమార్ కేన్సర్ బాధితుడు. ఈ వ్యాధితో బాధపడుతూ శనివారం ఉదయం 6 గంటల సమయంలో మృతి చెందాడు. మృతుని అంతిమ సంస్కారాలలో పాల్గొనేందుకు అతని స్నేహితుడు ఆనంద్ హాజరయ్యాడు. అశోక్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆనంద్ కళ్లుతిరిగి మండుతున్న ఆ చితిలో పడిపోయాడు. అందరూ చూస్తున్నంతలోనే అతని శరీరం 90శాతం మేరకు కాలిపోయింది. దీంతో స్థానికులు వెంటనే బాధితుడుని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో స్థానిక వైద్యులు బాధితుడిని ఆగ్రా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మృతుడు అశోక్ బంధువు ఒకరు మాట్లాడుతూ చితి మండుతుండగా ఉన్నట్టుండి ఆనంద్ కళ్లుతిరిగి చితిపై పడిపోయాడన్నారు. తాము వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా ఆనంద్కు నలుగురు కుమార్తెలున్నారు. మరోవైపు గ్రామస్తులు ఈ ఉదంతంపై మరో కథనాన్ని వినిపిస్తున్నారు. తన స్నేహితుడు అశోక్ మృతితో తీవ్రంగా కలత చెందిన ఆనంద్ స్నేహితుని చితిలో దూకాడని చెబుతున్నారు. స్నేహితుని మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడని అంటున్నారు.
స్నేహితుని చితిలో దూకిన యువకుడు ?
May 28, 2023
0
Tags