మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో శశిధర్ రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శశిధర్ చేరికను డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. తనకు కనీస సమాచారం లేకుండా శశిథర్ ను పార్టీలో చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో తిరుపతి రెడ్డి ఉన్నారు. 2004లో ఆయన మెదక్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు టికెట్ దక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. మళ్లీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంత కాలంగా ఆయన బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో తెలంగాణలో ఆ పార్టీ వైపునకు పలువురు నేతలు చూస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు చాలా మంది సన్నద్ధమవుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి
May 26, 2023
0
Tags