యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం

Telugu Lo Computer
0


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బి.ఎస్‌. యడియూరప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దిగాల్సిన హెలిప్యాడ్‌పై ప్లాస్టిక్‌ పేరుకుపోవడంతో చివరి నిముషంలో పైలట్‌ ల్యాండింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం యడియూరప్ప , మరికొంతమంది భాజపా నేతలతో కలిసి కలబుర్గి వెళ్లారు. జెవార్గి ప్రాంతంలో వీరి హెలికాప్టర్‌ను దించేందుకు స్థానిక అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ హెలిప్యాడ్‌పై చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ షీట్లు పేరుకుపోయాయి. హెలికాప్టర్‌  ల్యాండ్ అయ్యేందుకు కిందకు రాగానే అవన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరి ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారాయి. దీంతో పైలట్‌ చివరి నిముషంలో ల్యాండింగ్‌ను రద్దు చేసుకోవడంతో హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత స్థానిక యంత్రాంగం హెలిప్యాడ్‌ను శుభ్రం చేసి ల్యాండింగ్‌కు వీలు కల్పించారు. అప్పటిదాకా హెలికాప్టర్‌ అక్కడే గాల్లో చక్కర్లు కొట్టింది. కొంతసేపటి తర్వాత అదే హెలిప్యాడ్‌పై సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)