ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కర్నూల్ జిల్లాలో పత్తికొండ, దేవనకొండ, ఆస్పరి, ఆదోని, డోన్ ప్రాంతాల్లో టమాటా సాగు ఎక్కువ. ఈసారి ఒక్క కర్నూలు జిల్లాలో 4వేల హెక్టార్లలో సాగైంది. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతోంది. ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు పంటను పత్తికొండ మార్కెట్కు తీసుకొస్తుంటారు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో సగటున ఒకరోజు 250 టన్నుల వరకు సరకు వస్తుండేది. జొన్నగిరి, ఆస్పరి, చిగిలి, బిల్లేకల్లు, దేవనకొండ, ప్యాపిలి కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు వెలిశాయి. దీంతో పత్తికొండ మార్కెట్కు ప్రస్తుతం 100 నుంచి 120 టన్నుల వరకు సరకు వస్తోంది. గత నెలలో కిలో రూ.35 నుంచి రూ.40 పలికింది. దసరా వరకు ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. గత మూడ్రోజులుగా అనూహ్యంగా పడిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కాయలపై మచ్చలు వచ్చాయి. దీన్ని ఆసరా చేసుకుని వ్యాపారులు ధర తగ్గించేస్తున్నారు. గిట్టుబాటు కాకపోవడంతో రైతులు మార్కెట్లో పారబోసి పోతున్నారు. ఆయా మార్కెట్లన్నీ ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణ లేదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.