అల్ జవహరి హతం !

Telugu Lo Computer
0


అమెరికా మరోసారి ఆఫ్ఘనిస్తాన్‌ లో మెరుపుదాడులకు దిగింది. గుట్టు చప్పుడు కాకుండా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. డ్రోన్లతో దాడులు చేపట్టింది. భయానక ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులను చేపట్టి, విజయం సాధించింది. అల్ జవహరిని మట్టుబెట్టింది. ఈ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహణ, అల్ జవహరి మరణించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధృవీకరించారు. డ్రోన్ దాడిలో అతను మరణించినట్లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పడ్డాక అల్ జవహరి ఇటీవలే బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. రాజధాని కాబుల్ సమీపంలోని షెర్పూర్ ప్రాంతంలో నివసిస్తోన్నాడు. కొంతకాలంగా అతని కోసం అమెరికా వేట కొనసాగిస్తోంది. సుదీర్ఘకాలం పాటు అజ్ఞాతంలో గడిపిన జవహరి షెర్పూర్ ప్రాంతంలో నివసిస్తోన్నట్లు పసిగట్టింది.  అతణ్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులను చేపట్టింది. అమెరికా గూఢచర్య సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ- పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ సాగింది. ఈ ఆపరేషన్ నిర్వహిస్తోన్నట్లు అక్కడి తాలిబన్ ప్రభుత్వానికి కూడా తెలియదు. షెర్పూర్ నివాసం బాల్కనీలో కొంతమంది అనుచరులతో మాట్లాడుతుండగా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ ఘటనలో జవహరి హతం అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన బలగాలను ఉపసంహరించుకున్న తరువాత అమెరికా చేపట్టిన ఓ ప్రధాని దాడి ఇదే. ఈ విషయాన్ని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ కూడా నిర్ధారించారు. జులై 31వ తేదీన షెర్పూర్‌లో చోటు చేసుకున్న వైమానిక దాడుల్లో జవహరి మృతి చెందినట్లు చెప్పారు. జవహరి ఒక్కడే మరణించాడని, అతని కుటుంబ సభ్యులు గానీ, సాధారణ పౌరులకు గానీ ఎలాంటి హాని కలగలేదని పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల తాము అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నామని చెప్పారు. అమెరికా ఈ సీక్రెట్ ఆపరేషన్‌ను నిర్వహించడం అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)