జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమాలిన కాంగ్రెస్ నేత

Telugu Lo Computer
0


తెలంగాణ లోని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీని వీడుతున్నారనే ప్రచారం తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ కీలక నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఎంపీ, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ జగ్గారెడ్డితో భేటీ అయి ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. తాజా భేటీలో బొల్లి కిషన్ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమాలారు. మీ లాంటి నేతలు పార్టీని వీడొద్దని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తానో కోవర్ట్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చేస్తున్న పట్ల పార్టీ నాయకత్వం స్పందించకపోవడం బాధించిందన్నారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నా.. తనపై ఇలాంటి ప్రచారం చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు. పైగా తానేదీ మాట్లాడినా పార్టీకి నష్టం జరుగుతోందని మాట్లాడటం కూడా తనను బాధిస్తోందన్నారు. పేరు కోసమే ఎంతో కష్టపడుతూ వచ్చానని... పేరే లేనప్పుడు పార్టీలో కొనసాగడమెందుకని ప్రశ్నించారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అగ్రనేత రాహుల్‌లకు లేఖలు రాసినా.. వారి నుంచి స్పందన లేదన్నారు. పార్టీలో కొనసాగేది లేనిది ఇవాళ వెల్లడిస్తానన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ జగ్గారెడ్డి కార్యకర్తలకు, పేదోళ్లకు అండగా ఉండే నేత అన్నారు. గతంలో రూ.7 కోట్లు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించారని గుర్తుచేశారు. అలాంటి నేత పార్టీని వీడటం మంచిది కాదన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర జరుగుతోందన్నారు. ఇకనైనా టీపీసీసీ చీఫ్ అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని అన్నారు. తాజా భేటీ సందర్భంగా జగ్గారెడ్డి-వీహెచ్ కొద్దిసేపు చెవిలో గుసగుసలు చెప్పుకోవడం గమనార్హం. నీలాంటి నేతలు పార్టీలో ఉండి కొట్లాడాలని పార్టీని వీడొద్దని జగ్గారెడ్డికి వీహెచ్ విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)