హిందూ వ్యక్తి తన భార్య పోషణ, బాగోగుల నిమిత్తం ఏర్పాట్లుచేసి, తాను సంపాదించిన ఆస్తిని భార్య తన జీవితాంతం అనుభవించేలా పరిమితులతో కూడిన వీలునామా రాసిన పక్షంలో సదరు ఆస్తిపై ఆమెకు సంపూర్ణ హక్కులు దఖలు పడవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ల ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. హరియాణాకు చెందిన తులసీరామ్ మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య రామ్దేవి, కుమారుడి పేరున 1968లో వీలునామా రాశారు. తన ఆస్తిని ఆమె జీవిత కాలమంతా అనుభవిస్తూ, దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవించవచ్చని పేర్కొన్నాడు. ఆమె మరణానంతరం మాత్రం యావదాస్తి సంపూర్ణంగా తన కుమారుడికే చెందాలని అందులో స్పష్టం చేశాడు. తులసీరామ్ 1969లో మృతిచెందాడు. కొందరు వ్యక్తులు రామ్దేవి నుంచి ఆ ఆస్తిని కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది. చివరికి ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టుకు చేరింది. ''రామ్దేవి నుంచి ఈ ఆస్తిని కొనుగోలుచేసిన వ్యక్తులకు అనుకూలంగా సేల్ డీడ్లను కొనసాగించలేం'' అని ధర్మాసనం పేర్కొంది.
భర్త ఆస్తిపై రెండో భార్యకు పూర్తి హక్కులు ఉండవు!
February 02, 2022
0
Tags