4న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నషెకావత్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం వ్యవహారంలో కీలక అడుగు పడనుంది. పోలవరం సవరించిన అంచనాల అమోదం కోసం ఏపీ ప్రభుత్వం పదే పదే కోరినా కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. ఇదే సమయంలో ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేయటం పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ గతంలో ఢిల్లీ పర్యటన సమయంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని కేంద్ర మంత్రి షెకావత్ ను కోరారు. దీంతో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మార్చి 4న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్​ఫిల్ డ్యామ్, రేడియల్ గేట్లు సహా పనులను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అయితే, పోలవరం పైన అనేక కొర్రీలు పెడుతున్న సమయంలో నేరుగా మంత్రి పోలవరం పర్యటనకు వస్తున్నారు. 2013-14 ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నామని అందువల్ల కొత్త ఒప్పందం ప్రకారం సమర్పిస్తున్న వాటిని చెల్లించలేమంటూ అథారిటీ వాటిని వెనక్కి పంపింది. కొత్త ఒప్పందం ప్రకారం ఖర్చు చేసిన మొత్తంలో వివిధ పనుల కింద జలవనరుల శాఖ పంపిన బిల్లులను ఇటీవల పోలవరం అథారిటీ తిరస్కరించింది. ఈమేరకు రూ.324.84 కోట్ల బిల్లులను వెనక్కి పంపింది. పోలవరం విద్యుత్కేంద్రం నిర్మాణానికి డిసెంబరు వరకు చేసిన ఖర్చులకు సంబంధించిన రూ.133.97 కోట్ల బిల్లులను తిరస్కరించింది. విద్యుత్కేంద్రం కోసం నిధులు ఇవ్వబోమని ఇప్పటికే కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్కేంద్రం నిధులు అడగబోవడం లేదు. అయితే అక్కడ జరిగే మట్టి తవ్వకం పనులకు నిధులు ఇవ్వాలని, అది విద్యుత్కేంద్రం కాంపొనెంట్‌ కిందికి రాదని వాదిస్తోంది. కుడి కాలువలో తాత్కాలిక నిర్మాణాల కోసం చేసిన రూ.71.37 కోట్ల ఖర్చును ఇచ్చేందుకూ ఒప్పుకోవడం లేదు. అవి పట్టిసీమ నీటిని వినియోగించుకునేందుకు తాత్కాలికంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన బిల్లులని తేల్చింది. పోలవరం ప్రాజెక్టులో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.1,383 కోట్ల మేర బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది. ఇన్ని అభ్యంతరాలు.. కొర్రీల నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన ఏపీకి కీలకంగా మారింది. ప్రాజెక్టు సందర్శనతో పాటుగానే అక్కడే పోలవరం ప్రాజెక్టు అధారిటీ .. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ కేంద్ర మంత్రి కీలక సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో పోలవరం భవిష్యత్ పైన కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)