ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల కసరత్తు వేగంగా సాగుతోంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులతో పాటుగా ఉద్యోగుల విభజన పైన అధికారుల కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగుల జోనల్ వ్యవస్థ వ్యవహారం పైన చర్చ సాగుతోంది. అధికారుల కమిటీ ప్రతిపాదనలను సిద్దం చేసింది. సిక్స్ పాయింట్ ఫార్ములా మేరకు ప్రస్తుత ఉద్యోగుల జోనల్ వ్యవస్థ..అదే విధంగా కొత్త వ్యవస్థ పైన ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు ఉండగా.. రెండు మల్టీ జోన్లు... వాటి పరిధిలో నాలుగు జోన్లు ఉన్నాయి. మల్టీ జోన్-1 పరిధిలోని జోన్-1లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు, జోన్-2లో తూర్పు, పశ్చిమ గోదావ జరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. మల్టీ జోన్-2 పరిధిలోని జోన్-3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్-4లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలున్నాయి. తాజాగా 26 జిల్లాల ఏర్పాటు తరువాత ప్రస్తుతం ఉన్న విధంగానే రెండు మల్టీ జోన్లు, నాలుగు జోన్లనే ప్రతిపాదించారు. కానీ వాటి పరిధిలో కొత్త జిల్లాలు అదనంగా వస్తాయి. ఒక్కో జోన్లో 5 నుంచి 7 జిల్లాలు వస్తాయి. మల్టీ జోన్-1 పరిధిలోని జోన్-1లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, జోన్-2లో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు రానున్నాయి. మల్టీ జోన్-2 పరిధిలోని జోన్-3లో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్-4లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలను ప్రతిపాదించారు. జూనియర్ అసిస్టెంట్ దానికి సమాన స్థాయి ఉద్యోగుల బదిలీలు జిల్లా పరిధిలోనే ఉండడంతో వారు పూర్తిగా జోనల్ వ్యవస్థలోకి వస్తారు. జూనియర్ అసిస్టెంట్ కంటే పై స్థాయి ఉద్యోగుల నుంచి సూపరింటెండెంట్ల వరకు జోనల్ స్థాయి పరిధిలో ఉంటారు. సూపరింటెండెంట్ ఆ పై క్యాడర్ ఉద్యోగులంతా మల్టీ జోన్లోకి వస్తారు. దీంతో విభజన కారణంగా వారి పైన ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలున్నాయి. జిల్లాల విభజన పూర్తయితే..ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలను ప్రతిపాదించారు. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీబాలాజీ, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాలు ఉండాలని ప్రతిపాదించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రకాశం జిల్లా (ఆంధ్రా వర్సిటీ రీజియన్) పరిధిలోని 5 మండలాలు, నెల్లూరు జిల్లా (వెంకటేశ్వర వర్సిటీ రీజియన్) పరిధిలోని 30 మండలాలు ఉండడంతో దాన్ని ఏ రీజియన్ పరిధిలో చేర్చాలనే అంశంపై కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. వచ్చే నెలలో కొత్త జిల్లాల పైన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తరువాత.. ముసాయిదాను వెల్లడించనున్నారు. తుది ఆమోదంతో ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కార్యాయాలు మౌళిక వసతులు..ఉద్యోగుల కేటాయింపు..వంటివి పూర్తి చేసుకొని ఉగాది నుంచి కొత్త జాల్లాల్లో పాలన ప్రారంభం అయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది.
26 జిల్లాలు - నాలుగు జోన్లు
February 16, 2022
0
Tags