ఆఫ్రికా దేశమైన ఘనాలో భారీ పేలుడు సంభవించింది. పశ్చిమ ఘనాలో గురువారం పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న ట్రక్కు ఓ మోటార్సైకిల్ను ఢీ కొట్టడంతో భారీ పేలుడు సంభవించి భారీ ప్రాణ నష్టం సంభవించిందని ఘనా అధ్యక్షుడు తెలిపారు. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డట్లు తెలుస్తోంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న వైద్య, పోలీసు బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఖనిజాలు అధికంగా ఉండే పశ్చిమ ఆఫ్రికా దేశ రాజధాని అక్రకు పశ్చిమ దిశలోని బొగోసో నగరానికి సమీపంలోని అపియేట్లో మధ్యాహ్నం సమయంలో ప్రమాదం జరిగింది. బంగారు గనికి పేలుడు పదార్థాలను తీసుకువెళుతున్న ట్రక్కును ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగి ట్రక్కుకు అంటుకున్నాయి. మంటల వ్యాప్తితో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందిస్తూ ఇది నిజంగా దురదృష్టకరమని, విషాదకరమైన సంఘటన అని చెప్పారు. తమ “ప్రాథమిక దర్యాప్తులో పేలుడు పదార్ధాలను తీసుకువెళుతున్న ట్రక్కు మోటార్ సైకిల్ ను ఢీకొన్నట్లు నిర్ధారించబడింది” అని తెలిపారు. “బాధితులలో చాలా మందిని రక్షించి వివిధ ఏరియా ఆసుపత్రులకు తరలించామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రమద ఘటనపై డాక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ, ఐదుగురు క్షతగాత్రులను తమ ఆస్పత్రికి తీసుకుని వచ్చినట్లు.. వారిలో ఓ “ఐదేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు చెప్పారు. పేలుడు సమీపంలో ఉన్న ప్రజలను సమీప గ్రామాలకు తరలి వెళ్ళాలని పోలీసులు ఘటనా స్థలంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఎంత మంది చనిపోయారనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఘటన చాలా బాధాకరమైన విషయమని, దురదృష్టకరమైనదని ఆదేశ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు. పేలుడు సంభవించిన అనంతర దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఘనాలో భారీ పేలుడు : 17 మంది మృతి
January 21, 2022
0
Tags