వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఆ అవకాశం దక్కలేదు. దీంతో రెండున్నరేళ్ల తర్వాత జరగబోతున్న మంత్రివర్గ విస్తరణలో సైతం ఆమె మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నారు. దీంతో అసెంబ్లీతో పాటు బయట కూడా సీఎం జగన్ ను పొగుడుతూ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఎలాగైనా జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే కోవలో ఇవాళ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలోనూ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి జగన్ పై పొగడ్తల జల్లు కురిపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న అడిగితే పేరుతో సీట్లో నుంచి లేచిన రోజా అదే పనిగా జగన్ పై, ఆయన తల్లి విజయమ్మపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వాస్తవానికి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులకు నేరుగా సభ్యులు ప్రశ్నలు అడగడం మాత్రమే ఆనవాయితీ. కానీ రోజా మాత్రం ప్రశ్న అడక్కుండా వైఎస్సార్ ఆసరా పథకం జగన్ అమలు చేస్తున్న తీరుపై స్పీచ్ అందుకున్నారు. దీంతో స్పీకర్ తమ్మినేని జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా జగన్ పై చేస్తున్న పొగడ్తలతో ఈ మధ్య కాలంలో వైసీపీ సభ్యులే ఇబ్బందిగా ఫీలవుతున్న పరిస్ధితి. ఇవాళ కూడా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న అడిగే పేరుతో లేచిన రోజా.. జగన్ పై పొగడ్దల వర్షం కురిపిస్తుండటంతో ఇక చేసేది లేక స్పీకర్ తమ్మినేని ఆమె ప్రసంగానికి బ్రేక్ వేశారు. ఇది ప్రశ్నోత్తరాల సమయమని, మీరు పథకాలపై మాట్లాడాలనుకుంటే మరోసారి సమయం ఇస్తానని చెప్పేశారు. దీంతో స్పందించిన రోజా.. మా ముఖ్యమంత్రి (జగన్) ఏ అఁశంపైన అయినా ప్రశ్నలు అడిగే అవకాశమే ఇవ్వడం లేదని, అంత బాగా పాలిస్తున్నారని మళ్లీ పొగడ్తలు అందుకున్నారు. దీంతో మరోసారి స్పందించిన స్పీకర్... త్వరగా ముగించమని ఆమెకు సూచించారు. చివరికి ఆమె ప్రసంగం ముగించడంతో ఆ తర్వాత మరో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి ప్రసంగం ప్రారంభమైంది.